తేజస్వీపై బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ ప్రశంసలు

12 Nov, 2020 13:21 IST|Sakshi

భోపాల్ ‌: బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన ఆమె ప్రతిపక్షాలపై తరుచూ విరుచుకుపడుతుంటారు. ప్రత్యర్థులను పొగడటం చాలా అరుదు. బుధవారం భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉమాభారతి మాట్లాడుతూ.. తేజస్వీ యాదవ్‌ మంచి కుర్రాడని, అతడికి మంచి భవిష్యత్‌ ఉందని ఆమె ప్రశంసించారు. రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదని.. కానీ ఎప్పటికైనా బిహార్‌ను పాలించేది అతనేనని జోస్యం చెప్పారు.

ఇక మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలపైనా ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ ఈ ఉప​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచి పరిపాలన అందించిఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఆయన తన పెద్దన్నయ్య లాంటి వాడని, ఈ ఎన్నికల కోసం ఎంతో నేర్పుగా పనిచేశారని ప్రశంసించారు. కాగా, మధ్యప్రదేశ్‌లో 28 శాసన సభ స్థానాలకు నవంబర్‌ 3న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ19 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్‌ 9 సీట్లకే పరిమితమైన విషయం విదితమే.   (బిహార్‌లో సరికొత్త అడుగులు!)

>
మరిన్ని వార్తలు