‘విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్’‌ అంటూ నినాదాలు

7 Sep, 2020 15:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పబ్‌జీ ముందు వరుసలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యువతను బానిసలుగా చేసుకున్న ఈ గేమింగ్‌ యాప్‌పై భారత్‌‌ నిషేధం విధించిన విషయం విధితమే. దీంతో ఎంతో మంది తల్లిదండ్రులు పబ్‌జీ బ్యాన్‌పై ఆనందం వ్యక్తం చేస్తుంటే.. పబ్‌జీ ఆటగాళ్లు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పబ్‌జ్‌ బ్యాన్‌పై రకారకాల మిమ్స్‌ సోషల్‌ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తమకు ఇష్టమైన పబ్‌జీకి కొంతమంది యువకులు వినూత్నంగా వీడ్కోలు పలికారు. సదరు యువకులు ఈ గేమ్‌ యాప్‌కు అంతియ సంస్కరణలు నిర్వహించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో యువకులంతా తెల్లని వస్రాలు ధరించి.. పబ్‌జీ పోస్టర్‌ను పాడేపై ఉంచి దానికి పూలదండ వేశారు. అనంతరం వారంతా ‘విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌’ అంటూ నినాదాలు చేస్తూ ఇలా తమ అభిమాన యాప్‌కు ‌వినూత్నంగా వీడ్కోలు పలికారు.
(చదవండి: ఇండియన్ పబ్‌జీ...ఫౌజీ వచ్చేస్తోంది!)

అయితే భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ గేమ్‌తో పాటు 118 ఇతర యాప్‌లు కూడా ఉన్నాయి. భారత్‌లో ఈ పబ్‌జీ గేమ్‌ యాప్‌ను 50 మిలియన్‌ మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్‌ను మొదట దక్షిణ‌ కొరియా తయారు చేసింది. దీనిని డెస్క్‌టాప్‌ వర్షన్‌లో ఆడొచ్చు. తరువాత సౌత్‌ కొరియా నుంచి లైసెన్స్‌ పొందిన చైనా కంపెనీ టెన్‌సెన్ట్‌ పబ్జీ మొబైల్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు చైనా, భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీతో సంబంధం ఉన్న పబ్జీ మొబైల్‌ యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. (చదవండి: పబ్జీతో యువతలో పెరిగిన నేరప్రవృత్తి)

మరిన్ని వార్తలు