ఇండియా కూటమి రాకతో

15 Oct, 2023 05:45 IST|Sakshi

33 శాతం అమలు తథ్యం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సోనియా గాంధీ వ్యాఖ్య

సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్‌ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని  ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది.

డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్‌ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు.

మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్‌లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు.

రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...?  అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే,  బిహార్‌ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్‌ రాఖీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు