రైతు బిడ్డ కష్టం ఫలించింది.. రూ. 1.8 కోట్ల భారీ ప్యాకేజీతో జాబ్‌

27 Jun, 2022 14:04 IST|Sakshi

కోల్‌కతా: ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బిడ్డ.. తండ్రి కష్టం చూసి కష్టపడి చదివాడు. ఆ కష్టం ఇప్పుడు ఫలించింది. భారీ ప్యాకేజీతో ఉద్యోగం దక్కింది. అదీ ఫేస్‌బుక్‌లో. తమ బిడ్డ సాధించిన ఘనతకు ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. 

కోల్‌కతా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఫైనలియర్‌ చదువుతున్న బిశాక్‌ మోండాల్‌కు.. హయ్యెస్ట్‌పే ప్యాకేజీతో జాబ్‌ దక్కింది. అతనిది ఒక సాదాసీదా రైతు కుటుంబం. బీర్‌భూమ్‌లోని రామ్‌పూర్‌హట్‌లో ఉంటోంది అతని కుటుంబం. తండ్రి రైతుకాగా.. తల్లి అంగన్‌వాడీ వర్కర్‌. తమ బిడ్డను తమను గర్వపడేలా చేశాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. 

బిశాఖ్‌ సెప్టెంబర్‌లో లండన్‌లోని ఫేస్‌బుక్‌లో జాయిన్‌ కాబోతున్నాడు. కోటి 80 లక్షల రూపాయల ప్యాకేజ్‌. అయితే ఫేస్‌బుక్‌ కంటే ముందు అతనికి గూగుల్‌, అమెజాన్‌ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉండడంతో ఫేస్‌బుక్‌ వైపు మొగ్గు చూపించినట్లు తెలిపాడు. 

గతంలో కోటి కంటే ఎక్కువ జీతంతో తొమ్మిది మంది జేయూ విద్యార్థులు ఈ ఘనత సాధించగా.. ఆ అందరిలోకెల్లా హయ్యెస్ట్‌ ప్యాకేజీ దక్కించుకుంది మాత్రం బిశాఖ్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు