పల్లె సైనికుడా.. దేశ రక్షకుడా..

15 Aug, 2023 12:52 IST|Sakshi

నిర్మల్‌: జవాన్‌ అంటే ఉద్యోగం కాదని దేశ సేవ చేయడమేనని నిరూపిస్తున్నారు బోథ్‌కు చెందిన జవాన్లు. మండల కేంద్రం నుంచి దాదాపు 181 మంది జవాన్లు ఉన్నారు. వివిధ హోదాల్లో వీరు సేవలందిస్తున్నారు. రాబోయే రోజుల్లో అకాడమీ ఏర్పాటుకు పలువరు సైనికులు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక యువతకు సైనికులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా బోథ్‌ మండలానికి చెందిన యువత జవాన్‌గా మారడానికి సన్నద్ధమవుతున్నారు.

వీర మరణం పొందిన జవాన్..
'బోథ్‌ మండలం మర్లపెల్లికి చెందిన లింగాగౌడ్‌ కుమారుడు గొడిసెల సతీశ్‌గౌడ్‌ సీఆర్పీఎఫ్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2016లో గడ్చిరోలి, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోలు, సీఆర్పీఎఫ్‌ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో సతీశ్‌గౌడ్‌ మృతిచెందారు. ఆయన స్వస్థలం మర్లపెల్లిలో ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఆయన వర్ధంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు.'

ఒకే కుటుంబం నుంచి ఏడుగురు సైనికులు..
బోథ్‌లోని కదం భోజారామ్‌, ముకుంద్‌, శంకర్‌, నర్సింగ్‌రావులు అన్నదమ్ములు. దివంగత భోజారామ్‌కు ఐదుగురు కుమారుల్లో ప్రవీణ్‌ కుమార్‌, ప్రతాప్‌ సైనికులు. ముకుంద్‌కు ముగ్గురు కుమారుల్లో ఇద్దరు సైనికులే.

పెద్దకుమారుడు సుధాకర్‌ సైనికుడిగా సేవలందించి ఇటీవల రిటైర్డ్‌ అయ్యాడు. రెండో కుమారుడు మధుకర్‌ సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శంకర్‌ కుమారుడు ప్రశాంత్‌, కదం నర్సింగ్‌రావు కుమారుడు విజయ్‌ సైనికులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఏడుగురు జవాన్లుగా దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు.

మరిన్ని వార్తలు