సాక్షి, తిరుపతి: అమలాపురం అల్లర్ల ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. దానిని అందరూ ముఖ్త కంఠంతో ఖండించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ఘటనను ఎందుకు ఖండించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కుట్ర పూరిత రాజకీయాలు మానండని ప్రతి పక్షాలకు ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలో భాగంగా ఇలా చేశారని ఎంపీ ఆరోపించారు.
రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక కులాల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి, ప్రతి పక్ష పార్టీల నుంచి, సామజిక సేవా సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లాల పేర్లను ప్రకటించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్వార్ధ రాజకీయాల కోసం యువతను పెడతోవ పట్టించవద్దని ఎంపీ గురుమూర్తి కోరారు.