Mamata Banerjee: ఆ డబ్బు రాష్ట్రాలకు సమానంగా పంచాలి

9 Nov, 2021 16:56 IST|Sakshi

కేంద్రానికి మమతా బెనర్జీ డిమాండ్‌

కోల్‌కతా: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పెంచిన చమురు ధరలతో కేంద్రానికి వచ్చిన రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

బెంగాల్‌ శాసనసభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ... ‘పెరిగిన ధరలకు వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ విక్రయించడం ద్వారా విధించిన పన్నులతో కేంద్ర సర్కారు ఖాజానాకు దాదాపు రూ.4 లక్షల కోట్లు వచ్చాయి. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని బీజేపీ ఇపుడు డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం సమానంగా పంచాల’ని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చిందని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. (చదవండి: బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారు)

ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ధరలు పెంచి, తర్వాత మళ్లీ పెంచడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. చమురుపై వ్యాట్ తగ్గించకపోతే ఆందోళనలకు దిగుతామని చెబుతున్న బీజేపీ నాయకులు... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను గురించి ప్రశ్నించాలని అన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్ల పంపిణీలోనూ తమ రాష్ట్రంపై మోదీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. (‘టచ్‌ చేయమంటున్నారు కదా.. సంజయ్‌ టచ్‌చేయ్‌’)

మరిన్ని వార్తలు