టీఆర్‌ఎస్‌ పరిశీలకుల నియామకం..

6 May, 2021 03:07 IST|Sakshi

మేయర్, చైర్మన్‌ ఎన్నికల పరిశీలకుల జాబితా ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులతో పాటు మరో 5 మున్సిపాలిటీల చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పదవులకు చాలా చోట్ల టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా బహుముఖ పోటీ ఉండటంతో ఏకాభిప్రాయ సాధనతో ఏకగ్రీవ ఎన్నిక జరగాలని పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను ఖరారు చేశారు.

సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు. నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల జాబితాను కూడా సిద్ధం చేశారు. అయితే ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేందుకు సీల్డ్‌ కవర్‌ ద్వారా వారి వివరాలు వెల్లడిం చాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ పదవుల ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున పరిశీలకులను నియమించారు. వీరు పార్టీ అధినేత ఇచ్చే సీల్డ్‌ కవర్లను వెంట తీసుకుని గురువారం రాత్రికే తమకు కేటాయించిన కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీకి చేరుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

చదవండి: (7న మేయర్, చైర్మన్ల ఎన్నికలు)

మరిన్ని వార్తలు