Eggs Attack On CM Convoy: ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

24 Nov, 2021 16:39 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్‌ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్‌ మమతా మెహర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్‌ మిశ్రాకు సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి.

సీఎం కాన్యాయ్‌పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్‌ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!)

మరిన్ని వార్తలు