‘మంత్రి మల్లారెడ్డి ఒక బడాచోర్‌’

29 Aug, 2021 13:56 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్‌): మంత్రి మల్లారెడ్డి ఒక బడాచోర్‌ అని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు. మంత్రి అక్రమదందాలు, భూకబ్జాల ఆధారాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బట్టబయలు చేసినా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడడం ఎందుకని ప్రశ్నించారు. దళిత, గిరిజన దండోరా సభకు మద్దతుగా పెద్దపల్లిలో శనివారం యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పూదరి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఓదెల జెడ్పీటీసీ గంట రాములుతో కలిసి మాట్లాడారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కేసీఆర్‌ కూడా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తూ సీఎం కేసీఆర్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి అంతిమఘడియలు సమీపించాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని అన్నారు.

కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు బి.రమేశ్‌గౌడ్, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు జెమినిగౌడ్, కల్వల శ్రీనివాస్, బొంకూరి అవినాష్, శ్రీమాన్, బొడ్డుపల్లి శ్రీను, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: సీఎం కేసీఆర్‌ మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు: మాజీ మంత్రి

మరిన్ని వార్తలు