Munugode ByPoll Results: అసలు ఆట ఇప్పుడే స్టార్ట్‌ అయ్యింది.. కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఎటాక్‌!

7 Nov, 2022 12:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి చెందిన విషయం తెలిసిందే. బీజేపీ ఓటమిపై ఇప్పటికే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్పందించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అక్రమాలకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడులో నైతిక విజయం బీజేపీదే. మేము గెలిచి ఓటమి చెందాము. ఓటర్లకు ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరించారు. విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేశారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతమొందిస్తాము. 

గతంలో మునుగోడులో డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండోస్థానంలోకి వచ్చాము. మునుగోడులో ప్రచారానికి బీజేపీ నుంచి బయట నాయకులు ఎవరూ రాలేదు. ఎవరిది సంసారమో, ఎవరిది వ్యభిచారమో ప్రజలకు తెలుసు. ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తాము. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: ‘ధనబలంతో బీజేపీ.. ప్రజల గొంతు నొక్కాలని చూసింది
 

మరిన్ని వార్తలు