ఇక ఆపండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌

7 Nov, 2023 08:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. తెలంగాణలో కరెంట్‌పై కట్టుకథలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, ట్విట్టర్‌ వేదికగా ఎమ్మెల్సీ కవిత.. రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కట్టు కథలు చెప్పడం మానుకోండి కిషన్‌ రెడ్డి. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని కిషన్‌ రెడ్డికి సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే  తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.

ఇక, అంతకుముందు కిషన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు కవిత కౌంటిరిచ్చారు. 

మరిన్ని వార్తలు