ఐదేళ్లలో 'సోనార్‌ బంగ్లా' చేసి చూపిస్తాం: అమిత్‌ షా

20 Dec, 2020 16:58 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు. అమిత్‌ షా ఆదివారం  బోల్పూర్‌లో రోడ్‌ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తృణమూల్‌ చీఫ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ‘ఈ రోడ్‌ షో మమతా దీదీ పట్ల బెంగాల్‌ ప్రజలు కోపాన్ని చూపిస్తోంది. ఇలాంటి రోడ్‌ షో నా జీవితంలో చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల బెంగాల్‌ ప్రజల నమ్మకం, ప్రేమ ఈ రోడ్‌ షో చూపిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్‌, లెఫ్ట్‌, తృణమూల్‌ పాలన చూశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి, అయిదేళ్లలో స్వర్ణ బెంగాల్‌ సాధిస్తాం’  అని అమిత్‌ షా అన్నారు. అంతకు ముందు ఆయన విశ్వభారతి యూనివర్శిటీని సందర్శించారు. ఆ తర్వాత బెంగాలీ ఫోక్‌ సింగర్‌ నివాసంలో అమిత్‌ షా మధ్యాహ్న భోజనం చేశారు. (అమిత్‌ షా సమక్షంలో బీజేపీలోకి సువెందు అధికారి)

కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అమిత్‌ షా  పర్యటన కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన విషయం విదితమే. మరోవైపు బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా పలువురు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. (మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్‌ ట్విస్టు!)

>
మరిన్ని వార్తలు