మీ కొడుకు ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్‌ కౌంటర్‌

30 Jul, 2023 15:28 IST|Sakshi

సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మండిపడ్డారు. డీఎంకే పార్టీ వారసత్వ పార్టీ అని తమిళనాడులో వారసత్వ రాజకీయాలు ఉన్నాయంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్‌ కౌంటర్‌ వేశారు. కేంద్ర మంత్రి కొడుకు జై షాకు ఏ అర్హత ఉందని బోర్డు ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా(బీసీసీఐ) సెక్రటరీ పదవి కట్టబెట్టారని ప్రశ్నించారు.

కాగా అమిత్‌ షా శుక్రవారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. రామేశ్వరంలో రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కే అన్నామలై పాదయాత్రను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పూర్తి అవినీతి పార్టీ అని, మిత్రపక్షలతో కలిసి వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తుందని విమర్శలు గుప్పించారు. అదే విధంగా డీఎంకేను కుటుంబ పార్టీగా అభివర్ణించారు.
చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ లాయర్‌ అరెస్టు..

తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన డీఎంకే యువ‌జ‌న విభాగం నూత‌న కార్య‌వ‌ర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొన్ని అమిత్‌ షా ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతే మంత్రి అయ్యానని పేర్కొన్నారు.

తనను ముఖ్యమంత్రిని చేయాలన్నదే డీఎంకే నేతల ధ్యేయమని అమిత్‌ షా చెబుతున్నారని, మరి మీ కొడుకు(జై షా) బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నట్లు  పేర్కొన్నారు. జే ఎన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడారని, ఆయన ఎన్ని పరుగులు సాధించాడని ఉదనినిధి స్టాలిన్‌ అమిత్‌ షాను ప్రశ్నించాడు. తన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

(జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు: కిషన్‌ రెడ్డి)

మరిన్ని వార్తలు