కేసీఆర్‌ను మించిన ఫాసిస్ట్‌ దేశంలోనే లేరు

14 Sep, 2022 01:58 IST|Sakshi

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌:  సీఎం కేసీఆర్‌ను మించిన ఫాసిస్ట్‌ దేశంలోనే లేరని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అంతటి నియంత, అప్రజాస్వామికవాది, అహంకారపూరిత వ్యక్తి, అధికార దాహం ఉన్న వారు మరొకరు లేరన్నారు. ‘బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి రానివ్వను, మాట్లాడనివ్వను, ముఖం చూడను’అని పంతం పట్టడం, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విషయంలో ప్రోటోకాల్‌ పాటించకపోవడం, మంత్రులతో ఆమెపై విమర్శలు చేయించడం చూస్తే ఎవరేమిటో స్పష్టమౌతోందన్నారు.

అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్‌ అనైతిక చర్యని, నిజంగా సస్పెండ్‌ చేయాల్సి వస్తే నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన కేసీఆర్‌ను స్పీకర్‌ మొదట సస్పెండ్‌ చేయాలని స్పష్టంచేశారు. కిషన్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కేంద్రంపై, ప్రధానిపై కేసీఆర్‌ వ్యాఖ్యలు గురువిందను గుర్తు తెస్తున్నాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఒక్క ఎంపీ సీటూ రాదన్నారు. కరెంట్‌ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కేసీఆర్‌ చెబుతున్న గెజిట్‌ బహుశా ప్రగతిభవన్‌లో తయారైందేమోనని ఎద్దేవాచేశారు. 

నా ఒక్క లేఖకూ ముట్టినట్టు జవాబు రాలేదు..
విలేకరులతో చిట్‌చాట్‌లో... ‘ఈ ప్రభుత్వం నన్ను కేంద్ర మంత్రిగా గుర్తించడం లేదు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు భూముల కేటాయింపు, అనుమతులపై అధికారికంగా లేఖలు రాస్తే.. ముట్టినట్లు ఒక్క లేఖ పంపించలేదు. ఈ రాష్ట్రానికి నేను ఏం తెచ్చాననేది త్వరలోనే వెల్లడిస్తా. కష్టపడితే బీజేపి ఇక్కడ అధికారంలోకి రావడం ఖాయం. నేను ఎంపీగా పోటీ చేయాలా? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? అనేది మా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది’ అని మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.     

మరిన్ని వార్తలు