పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే అడ్డంకులు సృష్టిస్తోంది..

10 Dec, 2021 04:52 IST|Sakshi

వైఎస్సార్‌సీసీ ఎంపీలు చంద్రబోస్, గీత, అనురాధ, సత్యవతి 

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ దానిని పూర్తి చేసే బాధ్యత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విమర్శించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన కేంద్రం.. అనేక కొర్రీలు పెడుతూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఏపీ భవన్‌లో గురువారం ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, చింతా అనురాధ, బీశెట్టి సత్యవతిలు మీడియాతో మాట్లాడారు. బోస్‌ మాట్లాడుతూ ‘పోలవరం ప్రాజెక్టు రూ.55,656 కోట్ల సవరించిన అంచనాలకు ఫైనాన్స్‌ కమిటీ, సీడబ్ల్యూసీ టెక్నికల్‌ కమిటీలు ఆమోదించినా కేంద్రం ఆమోదించడం లేదు. దీనిపై పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను కలిసి విన్నవించినా పెండింగ్‌లోనే పెట్టారు.

ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి పనులకు సంబంధించి రూ.4 వేల కోట్ల వ్యయాన్ని తగ్గించారు. తాగునీటికి సంబంధించిన కాంపోనెంట్‌ను విడదీసి చూస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి మార్చాలని కోరుతున్నా ఆదేశాలివ్వడం లేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ విషయంలో గిరిజనులకు పునరావాస కల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీనే తుంగలో తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును గత ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు వాడుకుంటే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోందని, దీనికి కేంద్రం సహకరించాలని గీత విజ్ఞప్తి చేశారు. సత్యవతి మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి ఓ ప్రత్యేకాధికారిని నియమించారని, డీపీఆర్‌ను రూపొందించి కేంద్రానికి సైతం పంపారని, అపోహలు వద్దన్నారు.

మరిన్ని వార్తలు