Neeraj Chopra: అల్లు అర్జున్‌తో 'తగ్గేదే లే'.. రణ్‌వీర్‌తో చిందులు

13 Oct, 2022 09:20 IST|Sakshi

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా 'ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' ఈవెంట్‌లో తళుక్కున మెరిశాడు. ఢిల్లీ వేదికగా సీఎన్‌ఎన్‌ న్యూస్‌-18 ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రాతో పాటు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ సహా మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరీలో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా సినిమా పుష్ప: ది రైస్‌  సినిమాకు ''ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డు అందుకోగా.. ఆ తర్వాత క్రీడా విభాగంలో నీరజ్‌ చోప్రా ఈ అవార్డు తీసుకున్నాడు.

నీరజ్‌ చోప్రా, అల్లు అర్జున్‌లు ఒకే వేదికను పంచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన అనంతరం తనివీ తీరా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ్‌ చోప్రా అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ 'తగ్గేదే లే' మేనరిజంను చేసి చూపించాడు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరు కలిసి తగ్గేదే లే అంటూ ఫోజిచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టాడు నీరజ్‌ చోప్రా. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవలే నీరజ్‌ చోప్రా స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. 2017, 2018 డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ మీట్‌కు నీరజ్‌ అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్‌ చోప్రా  వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు.

చదవండి: అంబటి రాయుడు, షెల్డన్‌ జాక్సన్‌ వాగ్వాదం.. వీడియో వైరల్‌

పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌!

మరిన్ని వార్తలు