Ashes Series: ప్రియతమా.. నేనొచ్చేశా.. నువ్వు సూపర్‌ భయ్యా.. కౌంటర్‌ అదిరింది!

17 Jan, 2022 11:13 IST|Sakshi

Ashes Series: England Lost Series To Australia 4-0: యాషెస్‌ సిరీస్‌ 2021-22లో ఘోర పరాభవం మూటగట్టుకుంది ఇంగ్లండ్‌. ప్రతిష్టాత్మక ట్రోఫీని 4-0 తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేక రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అద్భుత పోరాటంతో నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా.. ఆఖరి టెస్టులో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక అప్రదిష్ట పాలైంది. 146 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌... ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ను ట్రోల్‌ చేశాడు. 

దక్షిణాఫ్రికాలో టీమిండియా ఓటమి నేపథ్యంలో వాన్‌ స్పందించిన తీరుకు మరోసారి తాజాగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘హెలో మైకేల్‌... యాషెస్‌ ఏమైంది’’ అంటూ బాలీవుడ్‌ మూవీకి సంబంధించిన మీమ్‌ షేర్‌ చేశాడు. ‘‘నేనొచ్చేశాను ప్రియతమా’’ అ‍న్న క్యాప్షన్‌తో సరదాగా ట్రోల్‌ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన మైకేల్‌ వాన్‌... శుభ సాయంత్రం వసీం...!! నిజంగా ఇదొక సుదీర్ఘమైన రోజు’’ అని బదులిచ్చాడు.

ఈ క్రమంలో టీమిండియా అభిమానులు వసీం జాఫర్‌ ట్వీట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘మంచి కౌంటర్‌ ఇచ్చావు భయ్యా.. నువ్వు సూపర్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత జట్టు పరాభవాన్ని ఉటంకిస్తూ.. వసీంను ట్యాగ్‌ చేస్తూ మైకేల్‌ వాన్‌ వ్యంగ్య రీతిలో ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు