భారత వరల్డ్‌కప్‌ జట్టులో కీలక మార్పు

28 Sep, 2023 19:58 IST|Sakshi

భారత వరల్డ్‌కప్‌ జట్టులో అందరూ ఊహించినట్లుగానే కీలక మార్పు జరిగింది. తొలుత ప్రకటించిన ప్రొవిజనల్‌ జట్టులోని సభ్యుడు అక్షర్‌ పటేల్‌ ఆసియా కప్‌-2023 సందర్భంగా గాయం బారిన పడి, పూర్తిగా కోలుకోలేని కారణంగా వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తప్పించబడ్డాడు. అక్షర్‌ స్థానంలో వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వరల్డ్‌ కప్‌ జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా, ముందుగా ప్రకటించిన జట్టే యధాథంగా కొనసాగించబడింది. జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్‌ 28) ఆఖరి తేదీ కావడంతో భారత సెలక్టర్లు హుటాహుటిన మార్పు విషయాన్ని అనౌన్స్‌ చేశారు. 

కాగా, ప్రపంచకప్‌ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికైన అక్షర్‌ పటేల్‌ గాయపడటం.. ఆసీస్‌తో సిరీస్‌కు అశ్విన్‌‌ భారత జట్టులోకి రావడంతో.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం (2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు).. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్‌కు అశ్విన్‌ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి.

ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్‌ 14న భారత్‌.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్‌ 30న  ఇంగ్లండ్‌తో.. అక్టోబర్‌ 3న నెదర్లాండ్స్‌తో రోహిత్‌ సేన తలపడుతుంది.

వరల్డ్‌కప్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌

మరిన్ని వార్తలు