-

ENG VS NZ 3rd Test: ఇంగ్లండ్‌ జట్టులోనూ కరోనా కలకలం.. బెన్‌ ఫోక్స్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ

26 Jun, 2022 15:27 IST|Sakshi

కరోనా మహమ్మారి యూకేలో విలయతాండవం చేస్తుంది. స్థానిక క్రికెటర్లతో పాటు ఆ దేశంలో పర్యటిస్తున్న క్రికెట్‌ జట్లలోని ఆటగాళ్లు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ (ఈసీబీ) క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. దీంతో ఫోక్స్‌ న్యూజిలాండ్‌తో జరుగుతున్న  మూడో టెస్ట్‌ నుంచి అర్ధంతరంగా వైదొలుగుతున్నట్లు ఈసీబీ పేర్కొంది. 

ఫోక్స్‌కు నడుము పట్టేయడంతో పాటు కరోనా లక్షణాలు ఉండటంతో మూడో రోజు ఆట బరిలోకి దిగలేదని ఈసీబీ వివరించింది. ఎల్‌ఎఫ్‌టి కోవిడ్‌ టెస్ట్‌లో ఫోక్స్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఫోక్స్‌ను ఐసోలేషన్‌కు తరలించామని, అతని రీప్లేస్‌మెంట్‌గా సామ్‌ బిల్లింగ్స్‌ను ఎంపిక చేశామని ప్రకటించింది. ఫోక్స్‌ జులై 1 నుంచి టీమిండియాతో జరుగబోయే టెస్ట్‌ మ్యాచ్‌లోపు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. 

ఐసీసీ కోవిడ్‌ నిబంధనల ప్రకారం సామ్‌ బిల్లింగ్స్‌ ఫోక్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా జట్టులో చేరతాడని, అతను నాలుగో రోజు ఆటలో వికెట్‌కీపింగ్‌ చేస్తాడని పేర్కొంది. కాగా, ఇవాళ ఉదయం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా కోవిడ్‌ బారిన పడినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.  రోహిత్‌ స్థానంలో జస్ప్రీత్‌ బుమ్రా టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 
చదవండి: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్

మరిన్ని వార్తలు