నిన్న హెల్మెట్‌తో ఫీల్డింగ్‌.. ఇవాళ భజ్జీలా బౌలింగ్‌

6 Feb, 2021 15:46 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్లు తీయడంలో చెమటోడుస్తున్నా.. ఎంటర్‌టైన్‌మెంట్‌లో మాత్రం ముందంజలో ఉంది. రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మ లాంటి ఆటగాళ్లు మైదానంలో ఫన్‌ క్రియేట్‌ చేయడంలో ఎప్పుడు ముందుంటారు. తొలిరోజు ఆటలో స్లిప్‌లో హెల్మెట్‌ పెట్టుకొని ఫీల్డింగ్‌ చేసిన రోహిత్‌ కొత్త ట్రెండ్‌కు తెరతీశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో నవ్వులు పూయించింది.

తాజాగా ఎలాగు మెయిన్‌బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో కోహ్లి బౌలింగ్‌ చేంజ్‌కోసం టీ విరామానికి ముందు పార్ట్‌టైమర్‌ రోహిత్‌తో రెండు ఓవర్లు  బౌలింగ్‌ వేయించాడు. అలా బంతి అందుకున్న రోహిత్‌కు వికెట్ల వెనకాల కీపింగ్‌ చేస్తున్న పంత్‌.. రోహిత్‌ భయ్యా..  అచ్చం భజ్జీలా బౌలింగ్‌ చేయ్‌ అంటూ గట్టిగట్టిగా అరిచాడు. దీనికి రోహిత్‌ బదులిస్తూ అలాగే సార్‌ అంటూ చమత్కరించాడు. రెండో ఓవర్‌ చివరి బంతిని అచ్చం హర్భజన్‌ శైలిలో ఆఫ్‌స్పిన్‌ వేయగా..బంతి ఫుల్‌టాస్‌ పడడంతో జో రూట్‌ సింగిల్‌ తీశాడు.అలా పంత్‌కిచ్చిన మాటను రోహిత్‌ నెరవేర్చాడు.

దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే... తొలిరోజు ఆటలో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిన ఇంగ్లండ్‌ రెండో రోజు తన జోరును కొనసాగించింది. ముఖ్యంగా జో రూట్‌ టీమిండియా పాలిట కొరకరాని కొయ్యగా మారి డబుల్‌ సెంచరీ సాధించాడు. రూట్‌కు ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ జతకలవడంతో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడానికి నానాతంటాలు పడ్డారు. ఇంగ్లండ్‌ జోరుతో దాదాపు రెండు సెషన్లు ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా మూడో సెషన్‌లో మాత్రం టీమిండియా మరో మూడు వికెట్లు తీయగలిగింది.  218 పరుగులు చేసిన రూట్‌ నదీమ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు 165 ఓవర్లలో 6 వికెట్లె  నష్టానికి 505 పరుగులు భారీ స్కోరు సాధించింది. జాస్‌ బట్లర్‌ 22, డొమినిక్‌ బెస్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి:
100వ టెస్టులో డబుల్‌ సెంచరీ, వాటే బ్యాటింగ్‌!

'నా పేరు వాషింగ్టన్‌.. డీసీకి వెళ్లాలనుకుంటున్నా'
హెల్మెట్‌తో స్లిప్‌ ఫీల్డింగ్‌.. సూపర్ అంటున్న నెటిజన్లు‌

>
మరిన్ని వార్తలు