ఐపీఎల్‌ వేలం: అందరి కళ్లు అతనిపైనే..

18 Feb, 2021 14:22 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 2021 మినీ వేలం కొద్దిసేపట్లో మొదలుకానుంది. వేలంలో 125 మంది విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా అందరి కళ్లు మాత్రం ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలాన్‌పైనే ఉన్నాయి. ప్రస్తుతం మలాన్‌ టీ20 ప్రపంచ నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గత కొద్దికాలంగా టీ20 మ్యాచ్‌ల్లో రికార్డు లెవల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2017లో ఇంగ్లండ్‌ తరపున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన మలాన్‌ 19 టీ20 మ్యచ్‌లాడి 855 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు మిగతా లీగ్‌ల్లోనూ మలాన్‌ తన జోరును కొనసాగించాడు.

దీంతో మలాన్‌ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్‌లో అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తుండడంతో ఈసారి ఐపీఎల్‌లో మంచి ధర పలికే అవకాశం ఉంది. మలాన్‌తో పాటు ఆసీస్‌ ఆల్‌రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. 2019 డిసెంబర్‌లో జరిగిన వేలంలో కమిన్స్‌ తర్వాత మ్యాక్స్‌వెల్‌కు అత్యధిక ధర పలికిన సంగతి తెలిసిందే. మ్యాక్స్‌వెల్‌ను 10.75 కోట్లకు కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ దక్కించుకుంది. కాగా ఐపీఎల్‌ 2020 సీజన్‌లో మాత్రం మ్యాక్స్‌వెల్‌ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 13 మ్యాచులాడిన మ్యాక్సీ 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్‌ జట్టు మ్యాక్స్‌వెల్‌ను రిలీజ్‌ చేసింది.

అయితే టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ మ్యాక్స్‌వెల్‌ దుమ్మురేపే ప్రదర్శన చేశాడు. దీంతో మ్యాక్సీ మరోసారి వేలంలో ఫెవరెట్‌ ఆటగాడిగా మారిపోయాడు. సీఎస్‌కే, ఆర్‌సీబీ లాంటి జట్లు మ్యాక్స్‌వెల్‌పై ఎన్ని కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు స్టీవ్‌ స్మిత్‌పై కూడా మంచి అంచనాలే ఉండడంతో అతనికి మంచి ధర పలికే అవకాశం ఉంది. వీరితో పాటు మొయిన్‌ అలీ(ఇంగ్లండ్‌), కైల్‌ జేమిసన్‌ (న్యూజిలాండ్‌)లకు కూడా వేలంలో మంచి ధర దక్కనుంది.


చదవండి: 10 కోట్లకు కొంటే ఆడలేదు.. ఇప్పుడేమో ఫేవరెట్‌!

మరిన్ని వార్తలు