Under 19 World Cup: రవి కుమార్‌ ‘స్వింగ్‌’.. సెమీస్‌లో యువ భారత్‌

30 Jan, 2022 05:34 IST|Sakshi

క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం

రాణించిన రవి కుమార్‌

కూలిడ్జ్‌ (అంటిగ్వా): అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో యువ భారత్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో 2020 అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఎడంచేతి వాటం పేస్‌ బౌలర్‌ రవి కుమార్‌ (3/14) స్వింగ్‌ బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను హడ లెత్తించాడు.

స్పిన్నర్‌ విక్కీ (2/25) కూడా రాణించాడు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ అంగ్‌కృష్‌ (44; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ (26; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (20 నాటౌట్‌; 4 ఫోర్లు), కౌశల్‌ (11 నాటౌట్‌; 1 సిక్స్‌) రాణించారు. రవి కుమార్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  ఫిబ్రవరి 1న తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో అఫ్గానిస్తాన్‌; ఫిబ్రవరి 2న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడ తాయి. ఫైనల్‌ ఫిబ్రవరి 5న జరుగుతుంది.

మరిన్ని వార్తలు