Ind Vs Zim 3rd ODI: అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇది నిజంగా అన్యాయం! కనీసం ఇప్పుడైనా..

22 Aug, 2022 13:13 IST|Sakshi
టీమిండియా(PC: BCCI)

India tour of Zimbabwe, 2022- 3rd ODI: టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గై​క్వాడ్‌, మహారాష్ట్ర బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠికి మరోసారి నిరాశే ఎదురైంది. జింబాబ్వేతో సిరీస్‌తోనైనా అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాలనుకున్న రుతు.. టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలనుకున్న రాహుల్‌ ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. కాగా జింబాబ్వే పర్యటనలో భాగంగా కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

రెండు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా ఆ ముగ్గురు
మొదటి వన్డేలో 10 వికెట్లు, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్లుగా వెటరన్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం దక్కింది. వీరిద్దరు కలిసి వరుసగా 81,82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు రికార్డు విజయం అందించారు.

ఇక రెండో వన్డేలో ధావన్‌తో కలిసి ఈ సిరీస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. దీంతో ఓపెనింగ్‌ స్థానంలో ఆడే రుతురాజ్‌కు అవకాశం దక్కలేదు. అదే విధంగా మిడిలార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌ బరిలోకి దిగడంతో త్రిపాఠికి మొండిచేయి ఎదురైంది.


రాహుల్‌ త్రిపాఠి- రుతురాజ్‌ గైక్వాడ్‌(PC: BCCI)

కనీసం ఇప్పుడైనా ఛాన్స్‌ ఇవ్వాలి కదా! అన్యాయం..
అయితే, ఇప్పటికే సిరీస్‌ భారత్‌ కైవసమైన నేపథ్యంలో వీరిద్దరికి అరంగేట్రం చేసే అవకాశం ఉంటుందని అభిమానులు భావించారు. కానీ.. నామమాత్రపు మూడో వన్డేలో కూడా రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘‘కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరికి ఛాన్స్‌ ఇవ్వాల్సింది.. ఇది నిజంగా అన్యాయం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవకాశం ఇవ్వకూడదని ఫిక్స్‌ అయినపుడు జట్టుకు ఎంపిక చేయడం ఎందుంటూ బీసీసీఐపై ఫైర్‌ అవుతున్నారు. ముఖ్యంగా విఫలమైనా ఇషాన్‌ కిషన్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారని.. కానీ త్రిపాఠి విషయంలో ఇలా చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.

కాగా టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప సైతం మూడో వన్డేకు ముందు మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో ఆఖరి నిమిషంలో బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న షాబాజ్‌ అహ్మద్‌ను కూడా మేనేజ్‌మెంట్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ఇక హరారే వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ స్థానాలను దీపక్‌ చహర్‌, ఆవేశ్‌ ఖాన్‌లతో భర్తీ చేశారు.

జింబాబ్వేతో మూడో వన్డే- భారత తుది జట్టు:
శిఖర్‌ ధావన్‌, కేఎ‍ల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆవేశ్‌ ఖాన్‌. 

చదవండి: WI Vs NZ 3rd ODI: ఓ సెంచరీ, కెప్టెన్‌ స్కోరు 91, మరో అర్ధ శతకం.. అయినా పాపం విండీస్‌! మా ఓటమికి కారణం అదే!
Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్‌ మిస్‌! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం..

మరిన్ని వార్తలు