IND vs NZ 2021: టి20 కెప్టెన్‌గా రోహిత్‌ .. తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్‌!?

9 Nov, 2021 17:10 IST|Sakshi

Reports Says Rohit Sharma Likely To Lead Test Team.. టి20 ప్రపంచకప్‌ 2021లో సూపర్‌ 12 దశ నుంచే వెనుదిరిగిన టీమిండియా నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌తో బిజీ కానుంది. కివీస్‌తో మొదట మూడు టి20లు ఆడనున్న టీమిండియా తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ బుధవారం టి20, టెస్టు జట్టును ప్రకటించనుంది. కాగా టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి వైదొలిగిన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రోహిత్‌కు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం.ఇక వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నాడు. టి20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తిలపై వేటు పడే అవకాశం ఉంది.

చదవండి: Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు

ఈ విషయం పక్కనబెడితే.. విరాట్‌ కోహ్లి న్యూజిలాండ్‌తో జరగనున్న టి20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. అయితే తర్వాతి రెండు టెస్టుల్లో మాత్రం కోహ్లి ఆడే చాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా.. టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానేకే తొలి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక టి20ల్లో కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కోహ్లితో పాటు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలు దూరంగా ఉండే అవకాశమున్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది. అయితే టి20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వరుణ్‌ చక్రవర్తి స్థానంలో ఐపీఎల్‌ 2021 పర్పుల్‌ క్యాప్‌ గెలిచిన హర్షల్‌ పటేల్‌కు చాన్స్‌ ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలిసింది. ఇక టి20 ప్రపంచకప్‌కు టీమిండియా రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఉన్న దీపక్‌ చహర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు తుది జట్టులో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలిసింది. చహల్‌ విషయమై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 17, 19, 21వ తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక నవంబర్‌ 25-29 వరకు కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్‌ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.  

మరిన్ని వార్తలు