Ind Vs SL 1st Test: విరాట్‌ కోహ్లి 100వ టెస్ట్‌.. అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌!

26 Feb, 2022 15:59 IST|Sakshi

స్వదేశంలో శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. మార్చి 4న మొహాలీ వేదికగా భారత్‌-శ్రీలంక  మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్ట్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కొవిడ్​ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించట్లేదని స్పష్టం చేసింది. ఇది ఇలా వుంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన కేరిర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. కోహ్లి 100వ టెస్ట్‌ మ్యాచ్‌కు మొహాలీ అతిథ్యం ఇవ్వనుంది. ఇక స్టేడియంకు వెళ్లి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని   భావించిన విరాట్‌ అభిమానులకు నిరాశే ఎదురైంది. 

"భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు  ప్రేక్షకులు లేకుండానే జరగనుంది" అని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో దీపక్‌ శర్మ పేర్కొన్నారు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఓటమి తర్వాత భారత టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ శర్మను భారత టెస్ట్‌ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. ఇక తన టెస్ట్‌ కేరిర్‌లో 99 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 7962 పరుగులతో పాటు 27 సెంచరీలు సాధించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అయ్యింది. ఇక విరాట్‌ తన 100వ మ్యాచ్‌లో నైనా సెంచరీ సాధించాలని అభిమానులు అశిస్తున్నారు.

చదవండి: భారత్‌, శ్రీలంక రెండో టీ20.. మ్యాచ్‌ జరిగేనా!

మరిన్ని వార్తలు