'ట్విటర్‌కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు.. అప్పుడే జట్టులోకి'

21 Jun, 2022 07:51 IST|Sakshi

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంపై రాహుల్‌ తెవాటియా పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ వేదికగా 'అంచనాలు బాధిస్తాయి' అంటూ తన నిరాశను వ్యక్తం చేశాడు.ఈ క్రమంలో తెవాటిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ట్విటర్‌కు బదులుగా తన ఆటపై ఎక్కువ దృష్టి పెట్టాలని తెవాటియాను సూచించాడు.

"ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేశారని భావిస్తున్నాను. మీరు ట్విటర్‌ బదులుగా ఆటపై ఎక్కువగా దృష్టి పెట్టి, అద్భుతమైన ప్రదర్శన చేయాలి. తర్వాత సిరీస్‌లకు జట్టును ఎంపిక చేసేటప్పుడు మీ పేరు ఖచ్చితంగా ఉండేలా చేసుకోవాలి" అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.

గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు రాహుల్‌ తెవాటియా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా సిరీస్‌కు ముందే తప్పుకున్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఆడిన తెవాటియా బాగా రాణించాడు. ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌ల్ ఆడిన తెవాటియా.. 147.62 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో గుజరాత్‌ జట్టుకు బెస్ట్‌ ఫినిషర్‌గా మారాడు.
చదవండి: IND VS SA T20 Series: భువనేశ్వర్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు

మరిన్ని వార్తలు