Sir Garfield Sobers Trophy 2021: ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఇద్దరు పాక్‌ ఆటగాళ్లు

31 Dec, 2021 20:47 IST|Sakshi

దుబాయ్‌: ICC Player of the Year (Sir Garfield Sobers Trophy) అవార్డు కోసం​ 2021 సంవత్సరానికి గాను అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ అటతీరును కనబర్చిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ శుక్రవారం(డిసెంబర్‌ 31) విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఇద్దరు పాక్‌ ఆటగాళ్లు నిలువగా.. టీమిండియా నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు.

ఈ జాబితాలో తాజా బ్యాటింగ్‌ సంచలనం, పాక్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ ముందువరుసలో ఉండగా.. అదే జట్టుకు చెందిన షాహీన్‌ అఫ్రిది, ఇంగ్లండ్ టెస్ట్‌ జట్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డు విజేతను 2022 జనవరి 24న ప్రకటించనున్నట్లు ఐసీసీ పేర్కొంది.

పాక్‌ వికెట్ కీపర్ కమ్‌ బ్యాటర్‌ అయిన రిజ్వాన్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 44 మ్యాచ్‌ల్లో 56.32 సగటుతో 1915 పరుగులు సాధించగా.. విలియమ్సన్ 16 మ్యాచ్‌ల్లో 43.31 సగటుతో 693 పరుగులు, రూట్.. 18 మ్యాచ్‌ల్లో 58.37 సగటుతో 1855 పరుగులు స్కోర్‌ చేశారు. వీరిలో రూట్‌ అత్యధికంగా 6 సెంచరీలు నమోదు చేయగా.. రిజ్వాన్‌ రెండు శతకాలు, విలియమ్సన్‌ ఒకటి సాధించారు.

మరోవైపు ఈ ఏడాది మొత్తం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన షాహీన్‌ అఫ్రిది.. 20.20 సగటుతో ఏకంగా 78 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్న రిజ్వాన్‌.. 29 మ్యాచ్‌ల్లో 73.66 సగటుతో ఏకంగా1326 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వికెట్‌ కీపింగ్‌లోనూ రాణించిన అతను.. 56 వికెట్లు పడగొట్టడంలో భాగస్తుడయ్యాడు.
చదవండి: ఆసియా కప్‌ విజేతగా టీమిండియా.. ఫైనల్లో లంకేయులపై ఘన విజయం

మరిన్ని వార్తలు