పాండ్యా ఇప్పుడు ధోనిలా కనిపిస్తున్నాడు

8 Dec, 2020 14:20 IST|Sakshi

సిడ్నీ : టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తరహాలోనే హార్దిక్‌ కూడా చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపిస్తూ మంచి ఫినిషర్‌గా పేరు సంపాదించాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హార్దిక్ 22 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో సిరీస్‌ నెగ్గిన టీమిండియా వన్డే సిరీస్‌ ఓటమికి బదులు తీర్చుకుంది. (చదవండి : ఏబీ ఎలా స్పందిస్తాడో చూడాలి : కోహ్లి)

మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌ మాట్లాడుతూ... ' ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఆడింది. మ్యాచ్‌ గెలవడంలో హార్దిక్ కీలకపాత్ర పోషించాడు. పాండ్యా ఎంత ప్రమాదకారే నాకు ముందే తెలుసు. అయితే ధోని తరహాలో హార్దిక్‌ మంచి ఫినిషర్‌గా మారుతున్నాడు.  గతంలో ధోనీ కూడా ఇలాగే మ్యాచ్‌లను గెలిపించాడు. భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నప్పటికీ.. హార్దిక్ తానే పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు. ధోనీ తరహాలోనే లెక్కలు వేసుకుని మరి బంతులను బాదాడు.' అని చెప్పుకొచ్చాడు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు')

మరిన్ని వార్తలు