‘జడేజాను మరచిపోయారా.. ఇది చాలా అవమానకరం’

17 Apr, 2021 15:17 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) విడుదల చేసిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో  రవీంద్ర జడేజాకు ‘ఎ+’ గ్రేడ్‌ ఇవ్వకపోవడాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ తప్పుబట్టాడు. రవీంద్ర  జడేజా చాలాకాలంగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడని, అటువంటి సందర్భంలో  ‘ఎ+’ గ్రేడ్‌లో అతన్ని ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించాడు.  జడేజాను ‘ఎ+’ గ్రేడ్‌లో తీసుకోవడానికి చర్చలు జరిపినా, చివరకు అతనికి దాన్ని కేటాయించకపోవడాన్ని వాన్‌ తప్పుబట్టాడు. ఒక కీలక ఆటగాడ్ని ఎందుకు ‘ఎ+’ కేటగిరీలో చేర్చలేదని ప్రశ్నించాడు. వార్షిక కాంట్రాక్ట్‌ల్లో జడేజాకు సరైన స్థానం ఇవ్వకపోవడం నిజంగానే అవమానకరమన్నాడు. భారత క్రికెట్‌ జట్టులో విరాట్‌ కోహ్లి తర్వాత అతనే ‘ఎ+’ కేటగిరీకి అన్ని విధాల అర్హుడని వాన్‌ అభిప్రాయపడ్డాడు. 

బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో  ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ‘ఎ+’ కేటగిరీలో కొనసాగుతున్నారు. అందులో కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. కాగా,  ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు గ్రేడ్‌ ‘బి’ నుంచి ‘ఎ’కు... పేస్‌ బౌలర్‌ శార్దుల్‌ ఠాకూర్‌కు గ్రేడ్‌ ‘సి’ నుంచి ‘బి’కి ప్రమోషన్‌ లభించింది.  భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

2019–2020 కాంట్రాక్ట్‌ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్‌ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు.

ఇక్కడ చదవండి: సాహోరే చహర్‌ బ్రదర్స్‌.. ఇద్దరూ సేమ్‌ టూ సేమ్‌‌‌‌‌
నువ్వు మంచి బౌలర్‌వి భాయ్‌, కానీ నెక్ట్స్ మ్యాచ్‌ ఆడకు’

మరిన్ని వార్తలు