PAK Vs AUS: శతకం చేజార్చుకున్న ఉస్మాన్‌ ఖ్వాజా.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్‌

6 Mar, 2022 21:20 IST|Sakshi

రావల్పిండి: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తుంది. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్‌ చేయగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (159 బంతుల్లో 97; 15 ఫోర్లు) 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకోగా, మరో ఓపెనర్‌ వార్నర్‌ (114 బంతుల్లో 68; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ లబూషేన్‌ (117 బంతుల్లో 69; 9 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (55 బంతుల్లో 24; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో సాజిద్‌ ఖాన్‌, నౌమాన్‌ అలీ తలో వికెట్‌ పడగొట్టారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా వర్షం కాసేపు అంతరాయం కలిగించింది.

అంతకుముందు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్‌ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ శతకాలతో చెలరేగడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించింది. షఫీఖ్‌ (44), బాబార్‌ ఆజమ్‌ (36) ఓ మోస్తరుగా రాణించగా, మహ్మద్‌ రిజ్వాన్‌ (29), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (13) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లియాన్‌, కమిన్స్‌, లబూషేన్‌ తలో వికెట్‌ పడగొట్టగా, బాబర్‌ రనౌటయ్యాడు. 

ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్‌ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు.
చదవండి: ఐపీఎల్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేను ఢీకొట్టనున్న కేకేఆర్‌

మరిన్ని వార్తలు