#ICCODIWC2023: వన్డే వరల్డ్‌కప్‌ ఆడడంపై ఉన్నతస్థాయి కమిటీ: పీసీబీ

8 Jul, 2023 21:12 IST|Sakshi

భారత్‌ గడ్డపై అక్టోబర్‌-నవంబర్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది. 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియాతో పాటు అన్ని జట్ల మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఇక చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్‌, టీమిండియాలు వన్డే వరల్డ్‌కప్‌లో అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా తలపడబోతున్నాయని ఫ్యాన్స్‌ కూడా సంతోషంలో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) వన్డే వరల్డ్‌కప్‌ విషయంలో మరోసారి ఆసక్తికర ప్రకటన చేసింది. టోర్నీలో పాల్గొనే విషయంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. అటు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) కూడా భారత్‌లో పర్యటించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని చెబుతోంది.  ఈ నేపథ్యంలోనే పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

విదేశాంగ శాఖ మంత్రి బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని ఈ కమిటీ.. ప్రపంచకప్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. భారత్‌-పాకిస్థాన్‌లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది.

మరోవైపు పీసీబీ తాత్కాలిక ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సల్మాన్‌ తసీర్‌.. డర్బన్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం వెళ్లారు. భద్రతా కారణాలు చూపించి.. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్‌ పదే పదే విముఖత వ్యక్తం చేస్తున్న విషయాన్ని వారు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. భారత్‌-పాక్‌లు ఐసీసీ, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడుతున్న విషయం తెలిసిందే.

చదవండి: #BANVsAFG: సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్‌ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు

మరిన్ని వార్తలు