WTC Final 2023: టీమిండియా టీ20 స్టార్‌కు బంపరాఫర్‌! డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే జట్టులో..

5 May, 2023 15:34 IST|Sakshi

ICC World Test Championship 2023 Final: టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బంపరాఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్‌ ఆడే జట్టులో అతడికి స్టాండ్‌బైగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కాగా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా కొనసాగుతున్న సూర్య.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 

అరంగేట్రంలో విఫలం
నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మొట్టమొదటి సారి బరిలో దిగిన సూర్య పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో రెండో మ్యాచ్‌ నుంచి అతడిని పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టు ఎంపిక సమయంలో సూర్య పేరును పరిగణనలోకి తీసుకోలేదు.

రాహుల్‌కు గాయం
అదే సమయంలో వెటరన్‌ బ్యాటర్‌, మాజీ వైస్‌ కెప్టెన్‌.. ఐపీఎల్‌-2023లో అదరగొడుతున్న అజింక్య రహానేకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా మెగా మ్యాచ్‌కు దూరమైన శ్రేయస్‌ అ‍య్యర్‌ స్థానంలో రహానేకు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌-2023లో ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే.

యూకే వీసా రెడీ చేసుకో!
ఈ నేపథ్యంలో సీజన్‌ మొత్తానికి అతడు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ నాటికి కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. సూర్యను స్టాండ్‌బైగా ఎంపిక చేసి లండన్‌ పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘ఇంతవరకు ఈ విషయంపై అంతిమ నిర్ణయం తీసుకోలేదు. అయితే, సూర్యను యూకే వీసా సిద్ధంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పారు’’ అని పేర్కొన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. 

ఐపీఎల్‌తో తిరిగి ఫామ్‌లోకి
కాగా స్వదేశంలో టెస్టుల్లో విఫలమైన సూర్య.. వన్డే సిరీస్‌లోనూ వరుసగా డకౌట్‌ అయి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌-2023 ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన సూర్య.. ప్రస్తుతం మూడు అర్ధ శతకాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

ఇక ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది. లండన్‌లోని ఓవల్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు జూన్‌ 12ను రిజర్వ్‌ డేగా ఫిక్స్‌ చేశారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కెఎల్ రాహుల్, కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్‌.

చదవండి: ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం.. 

మరిన్ని వార్తలు