Malaysia Open Badminton: తాడో పేడో తేల్చుకోనున్న సాయిప్రణీత్‌

28 Jun, 2022 09:14 IST|Sakshi

కౌలాలంపూర్‌: కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న భారత అగ్రశ్రేణి షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ మరో టోర్నీకి సిద్ధమయ్యాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌కు ఈ ఏడాదీ కలసి రావడంలేదు. ఈ సంవత్సరం ఆరు టోర్నీలలో బరిలోకి దిగిన సాయిప్రణీత్‌ ఐదు టోర్నీలలో తొలి రౌండ్‌లోనే వెనుదిరగ్గా... మరో టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు.

నేడు మొదలయ్యే మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీలో 30 ఏళ్ల సాయిప్రణీత్‌కు తొలి రౌండ్‌లోనే క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ తలపడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు హెచ్‌ఎస్‌ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్‌ వర్మ మలేసియా ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బరిలో ఉన్నారు.
చదవండి: Wimbledon: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ.. జకోవిచ్‌ శుభారంభం..

మరిన్ని వార్తలు