​​​​​​​Asia cup 2023: భారత్‌- పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరగాలి.. మోడీ సార్‌నే అడుగుతా?

21 Mar, 2023 11:59 IST|Sakshi

ఆసియా కప్- 2023 నిర్వహణ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ ఏడాది ఆసియాకప్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల దృష్ట్యా.. పాకిస్తాన్‌లో పర్యటించడానికి బీసీసీఐ అంగీక‌రించ‌డం లేదు. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను బీసీసీఐ సూచించింది.

మరోవైపు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం ఆసియాకప్‌ను తమ దేశంలోనే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆసియా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌ ఆడే మ్యాచ్‌లను యూఏఈ వేదిక‌గా నిర్వహించాలని, మిగితా మ్యాచ్‌లను పాక్‌లోనే జరపాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని అఫ్రిది సృష్టం చేశాడు. అదే విధంగా ఈ విషయం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను త్వరలోనే  మాట్లాడుతానని అఫ్రిది చెప్పాడు.

లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ ఫైనల్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన అఫ్రిది ఈ వాఖ్యలు చేశాడు. అఫ్రిది మాట్లాడుతూ.. "భారత్‌-పాక్‌ల మధ్య సంబంధాలు బాగుపడాలంటే ఇరు జట్ల మధ్య  ద్వైపాక్షిక సిరీస్ లు, ఇతర టోర్నీలు జరగాలి. రెండు దేశాల మధ్య  క్రికెట్ జరగాలని నేను మోడీ సార్నే అభ్యర్థిస్తాను. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా.. వారు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలము. బీసీసీఐ చాలా బలమైన క్రికెట్‌ బోర్డు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కానీ మనం పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు.. బాధ్యత కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు మిత్రులను పెంచుకోవాలి తప్ప శత్రువులను కాదు. మీకు సంభందాలు ఎంత ఎక్కువగా ఉంటే మరింత బలపడతారు. ఇక పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బలహీనంగా ఏమీ లేదు. ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ఓ ప్రత్యేకమైన స్ధానం ఉంది. భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ వంటి జట్లు కూడా పాకిస్తాన్‌కు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఇకభారత జట్టులో నాకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు. మేము కలిసినప్పుడు అన్ని విషయాలు గురించి చర్చించుకుంటాము. లెజెండ్స్‌ లీగ్‌ సందర్భంగా రైనాను కలిశాను. అతడి బ్యాట్‌తో ఓ మ్యాచ్‌ కూడా నేను ఆడాను" అని పేర్కొన్నాడు.
చదవండి: IND Vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! సూర్యకు ఆఖరి ఛాన్స్‌

మరిన్ని వార్తలు