గోపీచంద్‌ అకాడమీలో కరోనా కలకలం

13 Aug, 2020 20:58 IST|Sakshi

హైదరాబాద్‌:  నగరంలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో కరోనా కలకలం రేగింది. గోపీచంద్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేస్తున్న షట్లర్‌ సిక్కిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆమెతో పాటు ఫిజియోథెరపిస్ట్‌ కిరణ్‌ జార్జ్‌కు సైతం కరోనా వైరస్‌ సోకింది. వీరికి కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు చేయగా పాజిటివ్‌ వచ్చింది. దాంతో వీరిద్దరూ హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అదే సమయంలో గోపీచంద్‌ అకాడమీని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. శానిటైజ్‌ చేశారు. కాగా, అదే అకాడమీలో స్టార్‌ షటర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్‌, సైనా నెహ్వాల్‌లు ప్రాక్టీస్‌ చేస్తూ ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. 

శాయ్‌ నిబంధనల మేరకు అకాడమీలోని అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కరోనా టెస్టులు చేయనున్నారు. అయితే సిక్కిరెడ్డి, కిరణ్‌ జార్జ్‌లను కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరితో ఎవరు ప్రైమరీ కాంటాక్ట్‌ అయ్యారో వారి వివరాలు సేకరిస్తున్నారు. సిక్కిరెడ్డి, కిరణ్‌ జార్జ్‌లకు మరొకసారి ఆర్టీ పీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు.ఇప్పటికే పలువురు హాకీ ఆటగాళ్లకు కరోనా వైరస్‌ సోకగా, క్రికెట్‌లో కూడా కరోనా కలవరం మొదలైంది. తాజాగా సిక్కిరెడ్డి, కిరణ్‌ జార్జ్‌లు కరోనా వైరస్‌ సోకడం క్రీడాకారుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

మరిన్ని వార్తలు