T20 World Cup 2021: చాహల్‌ను అందుకే తీసుకోలేదు.. ఇక వరుణ్‌ విషయానికి వస్తే..

9 Sep, 2021 10:56 IST|Sakshi

ముంబై: వచ్చే నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ స్పిన్‌ విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌కు జట్టులో స్థానం దక్కకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించారు. జట్టు ప్రకటించిన  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  క్విక్‌గా బౌలింగ్ చేసే స్పిన్నర్లు మా ప్రాధాన్యత, అందుకే మేము చాహల్‌ స్థానంలో రాహుల్ చాహర్‌ను జట్టులో తీసుకున్నామని ఆయన తెలిపారు. 

ఐపీఎల్‌ ప్రదర్శన ‘మిస్టరీ ఆఫ్‌ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తికి చాన్స్‌ ఇప్పించిందని ఆయన అన్నారు. కాగా నాలుగేళ్ల తర్వాత అశ్విన్ మళ్లీ టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మెంటార్‌గా ఉండబోతున్నాడు. ఇక  2019 నుంచి చూస్తే చహల్‌ బౌలింగ్‌లో పదును తగ్గింది. శ్రీలంక పర్యటనలోనూ చహల్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతున్న రాహుల్‌ చహర్‌ వరల్డ్‌కప్‌ అవకాశం దక్కించుకున్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనుండగా.. అక్టోబరు 24న తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో భారత్ జట్టు ఢీకొట్టనుంది.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌ ఎంపికైనారు.

చదవండి: T20 World Cup Team India Squad 2021: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని

>
మరిన్ని వార్తలు