రాణించిన రాహుల్‌, జడేజా

4 Dec, 2020 15:29 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా జట్టులో కేఎల్‌ రాహుల్‌(51;40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించగా, రవీంద్ర జడేజా(44 నాటౌట్‌; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇక సంజూ శాంసన్‌(23; 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ఫీల్డింగ్‌  ఎంచుకోవడంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.  టీమిండియా ఇన్నింగ్స్‌ను రాహుల్‌,  ధావన్‌లు ఆరంభించారు.  కాగా, స్టార్క్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదోబంతికి  ధావన్‌ తడబడి బౌల్డ్‌గా నిష్క్రమించాడు.  అనంతరం కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. కేవలం ఫోర్‌ కొట్టిన కోహ్లి పెద్దగా మెరుపులేకుండా ఔటయ్యాడు. కాగా, కేఎల్‌ రాహుల్‌ మాత్రం మెరిశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. (ఇంగ్లండ్‌ తొండాట.. మోర్గాన్‌కు సీక్రెట్‌ మెసెజ్‌లు )

కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్‌ ధాటిగా ఆడే యత్నం చేశాడు. కానీ హెన్రిక్యూస్‌ వేసిన 12 ఓవర్‌ తొలి బంతికి స్వీప్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి శాంసన్‌ ఔటయ్యాడు. ఆపై కాసేపటికి మనీష్‌ పాండే(2) నిరాశపరిచాడు. అటు తర్వాత స్వల్ప వ్యవధిలో రాహుల్‌ కూడా ఔట్‌ కావడంతో టీమిండియా 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దాంతో  హార్దిక్‌-రవీంద్ర జడేజాలపై భారం పడింది. హార్దిక్‌(16; 15 బంతుల్లో 1 సిక్స్‌) స్కోరు పెంచే యత్నంలో ఔటయ్యాడు. హెన్రిక్యూస్‌ వేసిన 17 ఓవర్‌ ఐదో బంతికి హార్దిక్‌ పెవిలియన్‌ చేరాడు. జడేజా బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు 150 పరుగుల మార్కును చేరింది. జడేజా చివరి వరకూ క్రీజ్‌లో ఉండటంతో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో హెన్రిక్యూస్‌ మూడు వికెట్లు సాధించగా, స్టార్క్‌ రెండు వికెట్లు తీశాడు. ఆడమ్‌ జంపా, స్వెప్సన్‌లకు తలో వికెట్‌ దక్కింది. 

మరిన్ని వార్తలు