రెజ్లర్‌ సుశీల్‌తో పోలీసుల ఫొటో.. తీవ్ర విమర్శలు

26 Jun, 2021 10:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రియ శిష్యుడు సాగర్‌ ధన్‌కర్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయిన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో సుశీల్‌ నిందితుడిగా ఉన్నాడనే సంగతి పక్కనపెట్టి.. ఢిల్లీ పోలీసులు ఆ మాజీ ఒలింపిక్‌ మెడలిస్ట్‌తో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నేషనల్‌ మీడియా హౌజ్‌ల ద్వారా వైరల్‌ కావడంతో దుమారం మొదలైంది. 

మాస్క్‌లు లేవు, సోషల్‌ డిస్టెన్స్‌ లేదు. పైగా సుశీల్‌ సహా అందరూ ముఖంలో చిరునవ్వుతో ఫొజులిచ్చారు. ఆ ఫొటో తీసింది కూడా ఓ పోలీస్‌ అధికారే కావడం విశేషం. అయితే ఇది తాజా ఫొటోనేనా? లేక కరోనా విజృంభణ తర్వాత ఎప్పుడైనా తీశారా? తీస్తే ఎక్కడ తీశారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫొటో మీడియా హౌజ్‌ల ద్వారా జనం, అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ అధికారుల అభిమానంపై మండిపడుతున్నారు. సిగ్గులేకుండా ఇలాంటి డ్యూటీ చేస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై ప్రజలతో సహా ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతనిప్పుడు స్పోర్ట్స్‌ సెలబ్రిటీ కాదని.. ఓ హత్యకేసులో నేరస్థుడనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఓ ఉ‍న్నతాధికారి పేర్కొన్నాడు. జైలు ప్రాంగణంలో.. అదీ ఓ నేరస్తుడితో ఫొటోలు దిగిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అసోషియేషన్‌ ఫోరమ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. చదవండి: సుశీల్‌ గురించి సాగర్‌ పేరెంట్స్‌ ఏమన్నారంటే..

ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్‌ కుమార్‌పై సుశీల్‌ కుమార్‌, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో సాగర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి అనంతరం మూడు వారాలపాటు పరారీలో ఉన్న సుశీల్‌ను, సహ నిందితుడు అజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఆపై భద్రతా కారణాలతో సుశీల్‌ను తిహార్‌ జైలు-2కు తరలించారు. ఇక ఇదే కేసులో సుశీల్‌ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చదవండి: సాగర్‌ హత్య, ఆ రాత్రి ఏంజరిగిందంటే..

మరిన్ని వార్తలు