ఒకే రోజు రూ.35 కోట్లు జప్తు

19 Oct, 2023 04:02 IST|Sakshi

భారీగా పట్టుబడిననగదు, మద్యం, ఇతర ప్రలోభాలు

ఇప్పటికి రూ. 165.81 కోట్లకు చేరిన స్వాధీనాల విలువ

గత ఎన్నికల్లో పట్టుబడిన నగదురూ. 97 కోట్లు మాత్రమే 

సీఈఓ వికాస్‌రాజ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజాంపేట్, రఘునాథపల్లి:  రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో బుధవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో మొత్తం రూ.35.52 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో బుధవారం నాటికి రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.165.81 కోట్లకు పెరిగిపోయింది. బుధవారం రూ.6.25 కోట్ల నగదును జప్తు చేయగా, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.77.87 కోట్లకు పెరిగింది. 7వ తేదీ నుంచి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.8.99 కోట్లు విలువ చేసే 59,091 లీటర్ల మద్యం, 18,088 కిలోల నల్లబెల్లం జప్తు చేశారు.  

రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
బుధవారం రూ.3 కోట్లు విలువ చేసే 1,086  కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం గంజాయి విలువ రూ.7.55 కోట్లకు పెరిగింది.  కాగా ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం బంగారం, ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.62.73 కోట్లకు చేరింది. బుధవారం రూ.2.3 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.8.64 కోట్లకు చేరింది. దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.165.81 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధాణ ఎన్నికల్లో మొత్తం రూ.97 కోట్ల నగదు, రూ.34 కోట్లు విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వికాస్‌రాజ్‌  తెలిపారు. 

గిఫ్ట్‌ ఆర్టికల్స్, బెడ్‌షీట్స్‌ స్వాధీనం
హైదరాబాద్‌ దక్కన్, దానాపూర్‌–సికింద్రాబాద్‌  రైళ్లలో పార్శిల్‌ సర్వీసు ద్వారా సికింద్రాబాద్‌కు చేరుకున్న 30 భారీ కాటన్‌ పార్శిళ్ల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గిఫ్ట్‌ ఆర్టికల్స్, బెడ్‌షీట్లను రైల్వేపోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 26 కాటన్‌ పార్శిళ్లల్లో రూ.1.29 కోట్ల విలువ చేసే 2,160 కిలోల స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ఆర్టికల్స్, మరో నాలుగు కాటన్‌ పార్శిళ్లల్లో రూ.78 వేల విలుచేసే దుప్పట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో కేసులో సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌కు చెందిన కిషోర్‌సింగ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 538 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

రూ. 2.25 కోట్ల విలువైన చీరల పట్టివేతబాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి  ప్రగతినగర్‌లోనిపంచవటి అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఉన్నఏపీ 16టీవీ 3280 నంబరు గల లారీలో సరుకును పరిశీలించగా భారీ మొత్తంలో చీరలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.2,25,98,500 ఉంటుందని  అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పంచవటి అపార్ట్‌మెంట్‌లో ఓ రాజకీయపార్టీ సమావేశం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.

రూ.1.37 కోట్ల బ్యాంక్‌ డబ్బు సీజ్‌
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్‌ ప్లాజా వద్ద క్యూ ఆర్‌ కోడ్‌ సరిగా లేని బ్యాంకు నగదు రూ.1,37,50,000ను పోలీసులు సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు