రూపాయి తెచ్చిన పంచాయితీ !

23 Aug, 2022 07:35 IST|Sakshi

నల్గొండ (కోదాడరూరల్‌) : వాటర్‌ ప్యాకెట్‌ రేటుపై మద్యం దుకాణ నిర్వాహకుడికి మందుబాబులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.  అనంతగిరి మండలం గోల్‌తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగేందుకు  పట్టణంలోని ప్రమీలటవర్‌ సమీపంలోని ఓ వైన్స్‌ వద్దకు వచ్చారు. మద్యంతో పాటు వాటర్‌ ప్యాకెట్‌ కూడా తీసుకున్నారు. అయితే వైన్స్‌ నిర్వాహకుడు వాటర్‌ ప్యాకెట్‌కు రూ.3 తీసుకున్నాడు. దీంతో వారు వాటర్‌ ప్యాకెట్‌ రేటు రూ.2 కదా రూ.3 ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది.  మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి  వైన్స్‌ కౌంటర్‌లో ఉన్న వ్యక్తిని బయటకు లాగి గొడవకు దిగాడు. కౌంటర్‌ బల్లాపై ఉన్న మద్యం సీసాలను పగలకొట్టాడు. దీంతో కౌంటర్‌నుంచి బయటకు వచ్చిన వైన్స్‌ నిర్వాహకుడు కోపంతో  బీరుసీసా తెచ్చి తలపైకొట్టడంతో అతని తల పగిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని  వారిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు