ఎమ్మెల్యేల కేసు: హైకోర్టులో హీటెక్కిన వాదనలు.. ఎవరిది పైచేయి?

6 Dec, 2022 13:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. నిందితుల తరపు న్యాయవాది రేపు మరోసారి వాదనలు వినిపించనున్నారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే, సిట్‌ కాకుండా ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టులో సిట్‌ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా.. బీజేపీ తరఫున మహేష్‌ జఠ్మలాని, సిట్‌ తరఫున దుశాంత్‌ దవే వాదనలు వినిపించారు. 

వాదనల సందర్భంగా.. 
బీజేపీ జఠ్మలాని..
- సిట్‌పై నమ్మకంలేదు.. సీబీఐ విచారణకు ఆదేశించాలి. 
- రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కేసులు పెట్టారు.
-  కేసుతో సంబంధంలేని వారిని ఎఫ్‌ఐఆర్‌లో​ చేర్చారు అని అన్నారు. 

సిట్‌ దుశాంత్‌ దవే..
- డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా సీబీఐతో విచారణ జరిపించాలనడం సరికాదు. 
- ముగ్గురు నిందితులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్‌ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట​్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది. 

మరిన్ని వార్తలు