TS: స్కూల్‌లో 90 మంది విద్యార్థినిలకు అస్వస్థత.. మంత్రి సీరియస్‌

12 Sep, 2023 11:58 IST|Sakshi

సాక్షి, భీంగల్‌: ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. 

వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్‌ పాయిజన్‌తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్‌ఛార్జ్‌ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్‌ సీరియస్‌ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి వేముల.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరాతీశారు. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమా రాజ్‌తో మంత్రి మాట్లాడి.. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. 

ఇది కూడా చదవండి: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు

మరిన్ని వార్తలు