కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర భద్రత!

4 Sep, 2021 02:31 IST|Sakshi

కృష్ణా, గోదావరి బోర్డులకు హోంశాఖ లేఖ

సీఐఎస్‌ఎఫ్‌తో రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన సహకారంపై ముసాయిదా పత్రంలో వివరణ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర పారిశ్రామిక భద్రతాబలగాల (సీఐఎస్‌ఎఫ్‌)తో రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించే ప్రక్రియను త్వరగా చేపట్టాలని హోంశాఖను కేంద్ర జల శక్తి శాఖ కోరింది. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నియా మకానికి సంబంధించి బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, చేసుకోవాల్సిన ఒప్పందాలు తదితర అంశాలతో హోంశాఖ గోదావరి, కృష్ణా బోర్డు లకు లేఖ రాసింది. సిబ్బందికి కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలు, వాహ నాలు, కార్యాలయాల ఏర్పా టు, వారి జీతభత్యాలకు సం బంధించి కేంద్ర హోంశాఖ అండర్‌ సెక్రటరీ అశుతోష్‌ కుమార్‌ బోర్డులకు ఓ ముసా యిదా పత్రాన్ని పం పారు. 

అన్నింటికీ సీఐఎస్‌ఎఫ్‌ భద్రత
కృష్ణా, గోదావరి నదులు, ఉప నదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ కేంద్ర గెజిట్‌లోని మొదటి షెడ్యూల్‌లో చేర్చగా, షెడ్యూల్‌– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు వంద శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి.  ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, చివరకు ఫర్నిచర్‌ సహా అన్నింటినీ బోర్డులు తమ అధీనంలోనికి తీసుకుని రోజువారీ నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాగా కేంద్ర గెజిట్‌ మేరకు ఈ ప్రాజెక్టులన్నిటికీ సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించాల్సి ఉంది. 

బోర్డుల కసరత్తు నేపథ్యంలో..
జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వరకు అన్నింటినీ కృష్ణా బోర్డు తన స్వాధీనంలో ఉంచుకోనుండగా, గోదావరిలోని అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు తన పరిధిలోకి తెచ్చు కోనుంది. ఆయా ప్రాజెక్టులు, సిబ్బంది, కార్యాలయాల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను ఇప్పటికే బోర్డులు ఆదే శించాయి. ఎత్తిపోతల పథకాలు, కాలువలు, విద్యుత్కేం ద్రాలు, విద్యుత్‌ సరఫరా లైన్లు, ఆఫీసులు, సిబ్బంది వివరాలను అందజేయాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది.  ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత దిశగా హోంశాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్‌ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పె క్టర్లతో సహా ఇతర సిబ్బంది జీతభత్యాలు, వారి బ్యారక్‌ లు, కార్యాలయాలు, వాటి నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలు, తదితరాలపై ముసాయిదా రూపొందించి బోర్డులకు పంపింది. ఈ ముసాయిదా కాపీని బోర్డులు శుక్రవారం తెలుగు రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది.  
 

మరిన్ని వార్తలు