బిల్లుతో తీవ్ర నష్టం: కేంద్ర ప్రభుత్వంపై కరెంటోళ్ల కన్నెర్ర

19 Jul, 2021 18:36 IST|Sakshi
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆందోళన చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్‌ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనకకు తగ్గకపోతే ఆందోలనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆగస్టు10వ తేదీన మెరుపు సమ్మెకు విద్యుత్‌ సంఘాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవడంతో విద్యుత్‌ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న విద్యుత్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లుపై పోరాటం సాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు