సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ పదవికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆ పదవి నుంచి తనను తప్పించాలని ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా, మరో సీనియర్ నేత అమిత్ షాను కోరినట్లు సమాచారం.
ఇటీవల నడ్డా నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఈటల తనను చేరిక కమిటీ నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు.. చేరికల కమిటీ సమావేశంలోనూ పాల్గొనేందుకు ఆయన ఆసక్తి ప్రదర్శించడం లేదు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు టికెట్ భరోసా ఇవ్వకుండా ముందుకు వెళ్లకుండా సాధ్యం కాదని, అది చాలా కష్టమని ఈటల వాళ్ల వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అయితే గెలుపు గుర్రాలు వస్తే కాదంటామా ? అని ఈటలకు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ పరిణామం.. తదనంతర ఫలితాలపై పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీలో చేరికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చేరికలు ఆగిపోవడానికి మీరంటే మీరు కారణమంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు రాష్ట్ర నేతలు.