కృష్ణా ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దు చేయాలి

8 Sep, 2023 03:33 IST|Sakshi

కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ సర్కారు లేఖ

ఏపీలోని నాలుగు ప్రాజెక్టులకు మినహాయింపు తగదు

బేసిన్‌ వెలుపల ఉన్న వాటికి కేటాయింపులు లేవు

ఆ అధికారం కేవలం ట్రిబ్యునల్‌కే ఉంది

గెజిట్‌ ద్వారా మినహాయింపు ఇవ్వడం చెల్లుబాటు కాదని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపర్చిన ఆరు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ గత ఏడాది జూలై 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోఫికేషన్‌కు చట్టబద్ధత లేదని, దానిని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. బేసిన్‌ వెలుపల ఉన్న ఏపీలోని నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా.. అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదని స్పష్టం చేసింది.

నీటి కేటాయింపులు జరిపే అధికారం కేవలం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాజెక్టుల జాబితా అసంపూర్తిగా ఉందని.. 2002 నుంచే వినియోగంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును అందులో చేర్చలేదని వివరించింది.

బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉన్న ఈ గెజిట్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

తెలంగాణకు అన్యాయం..
కృష్ణా జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం కింద కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. ఆ  బోర్డుకు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో కృష్ణానదిపై తెలంగాణలోని కల్వ కుర్తి (అదనపు 15 టీఎంసీల సామర్థ్యం పెంపు), నెట్టెంపా డు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకా లను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. వీటికి ఏడాదిలోగా అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోవాలని పే ర్కొంది.

కానీ కేంద్రం వీటిని విభజన చట్టంలో 11వ షెడ్యూ ల్‌లో పొందుపరిచి, పూర్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లే దంటూ గత ఏడాది జూలై 27న సవరణ గెజిట్‌ జారీ చేసింది. అయితే.. ఇలా మినహాయింపు పొందిన ప్రాజెక్టుల్లో తెలంగాణలోని రెండే ప్రాజెక్టులు ఉండగా, ఏపీలోని 4 ప్రాజె క్టులు ఉండటంపై తెలంగాణ తాజాగా అభ్యంతరం తెలిపింది.

కృష్ణా బేసిన్‌ పరిధిలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను కోరుతూ కృష్ణా ట్రిబ్యునల్‌ ఎదుట వాదనలు వినిపి స్తున్నామని.. ఈ సమయంలో బేసిన్‌ వెలుపల ఉన్న ఏపీలో ని 4 ప్రాజెక్టులకు మినహాయింపు ఇస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసింది. బేసిన్‌ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు అ నుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు కోరుతు న్నామని తెలిపింది.

మరిన్ని వార్తలు