జీవో 317ను రద్దు చేయాలి

30 Dec, 2021 04:04 IST|Sakshi
గవర్నర్‌ తమిళిసై కి వినతి పత్రం ఇస్తున్న జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌  

పంజగుట్ట: జీవో 317తో రాష్ట్రాంలోని లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 జనగణనలో కుల గణన చేసేలా కేంద్రనికి లేఖ రాయా లని గవర్నర్‌ను కోరారు.

జనవరి 3వ తేదీన బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరం లో జరిగే సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావా లని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ జీవో వల్ల స్థానికత, సీనియారిటీ ఉన్న వారిని పక్క జిల్లాలకు బలవంతంగా బదిలీ చేస్తున్నారని, దీంతో వారు సర్వీస్, సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మాదిరిగానే బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన, బిహార్‌ వాసి అయిన సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు జీవో 317 వర్తింపచేయాలని, అప్పుడు ఉద్యోగుల భాధ ఆయనకు అర్థం అవుతుందన్నారు. తమ విజ్ఞప్తుల పట్ల గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, జనగణన కోసం కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు