వ్యాక్సిన్‌ దిగుమతికి చర్యలు చేపట్టాలి: హరీష్‌రావు

12 Jun, 2021 16:27 IST|Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వ్యాక్సినేషన్‌పై  44వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో  తెలంగాణ  రాష్ట్ర మంత్రి హరీశ్ రావు  కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతికి చర్యలు‌ చేపట్టాల‌న్నారు. కోవిడ్ 19 చికిత్సకు‌ సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు తెలిపారు. అవసరాల‌ తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. రెండో దశలో కరోనా సృష్టించిన విలయం,  థర్డ్‌ వేవ్‌ కూడా మరింత  ఉధృతంగా రానుందన్న అంచనాల మధ్య  కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు.

కోవిడ్ 19 చికిత్సకు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు. కమిటీ లోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కరోనా కోవిడ్ ఉధృతి‌, లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా తమ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. మే నె‌లలో‌లాక్ డౌన్ వల్ల రూ. 4100‌కోట్లు ఆదాయాన్ని కోల్పోయమని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ఆర్‌బీఎంను నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఎఫ్ఆర్‌బీఎం పెంపు వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందన్నారు.
 

మరిన్ని వార్తలు