గెల్లు శ్రీనివాస్‌కు బీఫారం అందజేసిన కేసీఆర్‌ 

1 Oct, 2021 01:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ బీఫారం అందజేశారు. దానితోపాటు ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఫండ్‌గా రూ.28 లక్షల చెక్కును ఇచ్చారు. ఉప ఎన్నికకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై అక్టోబర్‌ 8న ముగియనుంది. 7 లేదా 8 తేదీల్లో గెల్లు శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశముంది.

అయితే గురువారం రాత్రి మంచి ముహూర్తం ఉండటంతో మంత్రి హరీశ్‌రావుతో కలిసి గెల్లు శ్రీనివాస్‌ ప్రగతిభవన్‌కు వెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్‌ పార్టీ బీఫారం అందజేశారు. అనంతరం ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్, విపక్షాల విమర్శలకు సమాధానం, అన్నివర్గాల ఓటర్లను కలిసేలా ప్రణాళికలపై హరీశ్‌రావు, గెల్లు శ్రీనివాస్‌లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కనీసం రెండు బహిరంగ సభల్లో పాల్గొనాలని కేసీఆర్‌ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు